ఒకవైపు దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్. మరోవైపు ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్. ఇంకోవైపు వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ.. సక్సెస్లో ఉన్న నార్త్ స్టార్ అక్షయ్కుమార్. ఇవే కాక త్రీడీ, 4డీ సౌండ్ సిస్టమ్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి ఎన్నో ప్రత్యేకత లతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం “2.ఓ” మూలుగా రజనీ సినిమా వస్తోందంటేనే అభిమానుల సంబరాలకు హద్దులుండవు. ఇక శంకర్ కాంబినేషన్లో తలైవా వస్తున్నాడంటే బాక్సాఫీస్ కూడా హడలెత్తిపోతుంది.
గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే రోబోకు సీక్వెల్గా ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించిన ‘2.ఓ’ అంచనాలనుఅందుకోబోతుందా ? బాహుబలి రికార్డులను చిట్టి బద్దలుకొట్టనున్నాడా? శంకర్ మరోసారి తన విజన్తో మ్యాజిక్ చేశాడా?.అనే సందేహాలను అభిమానులు నివృత్తి చేసుకోవాంటే సినిమాను చూడాల్సిందే…
కథ ..
హఠాత్తుగా నగరంలోని సెల్ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి కూడా ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఈ సమస్య ఎందుకు ఎదురైంది? ఎలా పరిష్కరించాలో ఎవరికీ అంతుపట్టదు. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. డా.వసీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగి దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి.. మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు. అయితే సెల్ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్న పక్షిరాజా (అక్షయ్ కుమార్)ను చిట్టి ఒంటరిగా ఎదురించిందా? ‘2.ఓ’ రావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు పక్షిరాజాలా అక్షయ్ మారడానికి దారి తీసిన కారణాలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
నటీనటులు..
సూపర్స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ల చుట్టూనే కథ నడుస్తుంది. ఇందులో సైంటిస్ట్ పాత్రలో వసీకరణ్గా, చిట్టి, 2.ఓ రోబో పాత్రల్లో రజనీ నటన ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల్లో భిన్నంగా రజనీ చేసిన అద్భుతం అభిమానులకు కన్నులపండువగా ఉంటుంది.. ఇక అక్షయ్కుమార్ నటన ఈ సినిమాకు ప్రత్యేకంగా నిలుస్తుంది. పక్షిరాజాలా అక్షయ్ నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అక్షయ్ నటనలోని మరో కోణాన్ని శంకర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. అమీ జాక్సన్ తన పరిధి మేర ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నారు.
విశ్లేషణ..
శంకర్ సినిమా సామాజిక స్పృహ, సందేశాత్మక సినిమాలు చేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకూ శంకర్ తీసిన సినిమాలను చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకు కూడా సామాజిక కోణంలోంచే కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించిన తీరు అద్భుతం. సెల్ఫోన్లకు మనుషులు ఏవిధంగా బానిసవుతున్నారో? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ఎంతోఅద్భుతంగా తెరకెక్కించారు.
విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఏఆర్ రెహమాన్, రసూల్ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది. స్వర మాంత్రికుడు తన మ్యూజిక్తో మ్యాజిక్ చేయగా.. ఇండియన్ సినిమాలో 4డీ సౌండ్ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్ తీసుకెళ్లారు. నీరవ్ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఆంటోని ఎడిటింగ్ పనితనం కూడా ఈ సినిమాకు కలిసివచ్చింది.